రంగారెడ్డి : ఎద్దు ఏడిసిన ఎవుసం… రైతు ఎడిసిన రాజ్యం ఎప్పుడూ సంతోషంగా ఉండవంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి రైతు కోవ అభిమాన్ తన కాడెద్దు చనిపోవడంతో తన కుమారుడు సాయినాథ్ను మరో ఎద్దుకు జతగా మార్చి దుక్కి దున్నాడు. ఎద్దుతో పాటు కష్టపడుతూ దుక్కి దున్నతున్న వీడియోలు ఇటు మెయిన్ మీడియాతో పాటు అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇది చూసిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఎంతగానో చలించిపోయారు. ఆ కుటుంబానికి ఓ ఎద్దును కొనిస్తానని తెలిపారు.
అన్న మాట ప్రకారమే బుధవారం ఎంపీ అక్కడి పశు వైద్యుడితో మాట్లాడారు. ఆ రైతు వద్ద ఉన్న ఎద్దుకి జతగా మరో ఎద్దు కొనుగోలుకు ఎంత అవుతుందో తెలుసుకుని అందుకు సంబంధించిన డబ్బులను(రూ.40) స్థానికుల ద్వారా పంపించారు. ఎంపీ సాయంతో రైతు అభిమాన్ తన ఇంటికి ఎద్దుని తీసుకొని పోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. తమ కష్టాన్ని అర్థం చేసుకొని ఎంపీ స్పందించడం ఆనందంగా ఉందని అభిరామ్ తెలిపారు.