తుక్కుగూడ, ఏప్రిల్ 14: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో అయ్యప్ప దేవాలయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ హైమాస్ట్ లైట్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను తీర్చేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వార రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర అవసరాలతో పాటు ప్రతి ఒక్కరికీ ఆఖరి మజిలీ అయిన వైకుంఠధామాలను తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి వీధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలపారు. కార్యక్రమంలో తుక్కుగూడ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్ కౌన్సిలర్లు సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్, బూడిద తేజస్వినీ శ్రీకాంత్గౌడ్, బాదావత్ రవినాయక్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన హృదయాల్లో నిలిచిపోయిన ధన్యజీవి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్ధార్నగర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఆయనకు ఉన్నన్ని విగ్రహాలు మరెవరికి లేవన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి మరువలేనిదన్నారు. మున్సిపల్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు రెడ్డిగళ్ల సుమన్, సప్పిడి లావణ్య రాజుముదిరాజ్, తేజస్వినీ శ్రీకాంత్గౌడ్, బాదావత్ రవినాయక్, అంబేద్కర్ యువజన సంఘం నేతలు పాల్గొన్నారు.