మేడ్చల్, మార్చి 8 : చోరీలే వృత్తిగా ఎంచుకుని రెండు నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాళం వేసి ఉన్న ఇండ్లు, ఒంటరిగా వెళ్తున్న మహిళల నగలు దోచుకునే ముఠాను నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు కేసు వివరాలను వెల్లడించారు.ఏసీపీ వివరాల ప్రకారం…. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన పార్థీ తెగకు చెందిన 60 మంది సభ్యుల ముఠా నేరాలనే వృత్తిగా ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నగర శివారులోని చోరీలకు పాల్పడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గుడిసెలు వేసుకుని తాత్కాలిక నివాసం ఏర్పర్చుకుని ఉదయం వేళల్లో పూసలు, రుద్రాక్షలు, ఆయుర్వేద వస్తువులు విక్రయిస్తూ కాలనీల్లో పర్యటిస్తారు. ఆ సమయంలోనే వారు తాళం వేసి ఉన్న ఇండ్లను గమనించి రెక్కీ నిర్వహించి ప్లాన్ వేస్తారు. అనంతరం రాత్రి చోరీలకు పాల్పడుతారు. అంతే కాకుండా నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని అడ్డుకుని మారణాయుధాలతో బెదిరించి దోచుకుంటారు. నేరాలకు పాల్పడే క్రమంలో తమపై ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తపడి ఎక్కడ తమ పేరును చెప్పకుండా జాగ్రత్త పడుతారు.
పోలీసులకు అనుమానం వస్తే వారు అక్కడి నుంచి తమ మకాం మార్చేస్తారు. ఇటీవల మేడ్చల్ సమీపంలోని కొంపల్లి-బొల్లారం రోడ్డులో గుడిసెలు వేసుకుని ఉన్న వీరు రెండు, మూడు నెలలుగా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. అక్కడి పోలీసులకు అనుమానం రావడంతో తమ మకాంను మేడ్చల్లోని మంజు వైన్స్ వెనకకు మార్చి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. కాగా డిసెంబర్ నెలలో మేడ్చల్లో వరుస దొంగతనాలు జరిగాయి. ఈ నేరాల వివరాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలానగర్ డీసీపీ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నేరస్థుల వివరాలను గుర్తించి మేడ్చల్ మంజు వైన్స్ వద్ద గుడిసెలు వేసుకుని నివాసముంటున్న దొంగల ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. 15 మంది దొంగల్లో నలుగురు తప్పించుకోగా…11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో పార్థి, లేలే గుజ్జర్, జులాబుద్దీన్, అన్సూర్ , అమీన్ , రుజన్ సింగ్ , మిన్సారీ లాల్ , అలీబేగ్, ఖాన్కోడే , సీరబ్లాల్తో పాటు మైనర్ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.1.40 లక్షల విలువ చేసే రెండు బైక్లు, 4 గ్రాముల బంగారం, సిల్వర్ కాయిన్, రెండు సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో 13 దొంగతనాలు, వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 9 చోరీలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును చేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.