సికింద్రాబాద్, మే 21: నియోజకవర్గ పరిధిలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు కూడా పాత్రులు కావాలని సూచించారు. సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, కార్పొరేటర్లతో కలిసి కరోనా నివారణ చర్యలను సమీక్షించారు. సీతాఫల్మండి, తుకారాంగేట్, అడ్డగుట్ట, చిలకలగూడ, లాలాపేట్, రెడ్క్రాస్, మెట్టుగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టెస్టింగ్పై వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత, పాల్గొన్నారు.
కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా చేపడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.2 కోట్లు విలువచేసే చెక్కులను సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. దీంతో ముషీరాబాద్, మారేడ్పల్లి రెవెన్యూ మండలాల పరిధిలోని సీతాఫల్మండి, బౌద్ధనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు చెందిన 200 మందికి లబ్ధి చేకూరింది. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన రూ.6.5 లక్షల విలువచేసే పత్రాలను కూడా డిప్యూటీ స్పీకర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారంగా మారకుండా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తహసీల్దార్ సునీల్కుమార్, కార్పొరేటర్లు హేమ, సునీత పాల్గొన్నారు.