హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో పేదలకు ఆహార భద్రత కల్పించే క్రమంలో భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని భారత ఆహార సంస్థ, తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 కొవిడ్ కాలంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం మూడో దశను ప్రారంభించిందన్నారు. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలోని అంత్యోదయ అన్న యోజన, ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ నెలకు 5 కిలోల చొప్పున మే, జూన్ 2021 నెలలకు గాను ఉచితంగా అందజేయబడుతుందని పేర్కొన్నారు.
అలాగే, అన్నార్తులకు, వలస కార్మికుల సేవకై సహాయ శిబిరాలు నిర్వహించే సేవా సంస్థలు/ ఎన్జీవోలకు ఓపెన్ మార్కెట్ అమ్మకం కింద ఆహార ధాన్యాలు తక్కువ ధరలో (బియ్యం క్వింటాలుకు రూ.2200/-, గోధుమలు క్వింటాలు కు రూ. 2100/-) అందజేయబడతాయని వివరించారు. అంతేగాక, ఆహార ధాన్యాల పంపిణీని విస్తరించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఆహార ధాన్యాలు అందజేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
శ్రీ గుప్తా మాట్లాడుతూ.. రేషన్ పోర్టబిలిటీని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకే దేశం – ఒకే రేషన్ కార్డు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సాహించాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలు పొందవచ్చునని తెలిపారు.