హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని అడ్డుకోవాలని చూసే వ్యక్తులను, పార్టీలను తరిమికొడతామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధు పథకాన్ని కొంతమంది దుర్మార్గంగా అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, వారి చర్యలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు వంటి పథకాన్ని ఏ రాజకీయ పార్టీ తేలేదన్నారు. బీజేపీ నాయకులు మొనగాళ్లే అయితే ఈ పథకాన్ని దేశమంతా అమలు చేసే విధంగా ప్రయత్నించాలని సవాల్ విసిరారు. పేదవర్గాల దళితులను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా చేయాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని దళితులందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ఈ పథకం అమలు కోసం తాను ఊరూరా డప్పు పట్టుకొని దండోరా వేస్తూ ప్రచారం చేస్తానని చెప్పారు. దేశచరిత్రలో దళితుల కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తానని చెప్పిన మొనగాడు, మొగోడు సీఎం కేసీఆరేనని కొనియాడారు.
దళితుల భూములు లాక్కున్న ఈటలను బహిష్కరించండి
దళితుల భూములను ఆక్రమించిన ఈటల రాజేందర్ను బహిష్కరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి పిలుపునిచ్చారు. గోసిగుడ్డ లేని స్థితి నుంచి ఈటల రాజేందర్ 700 ఎకరాల భూమిని, వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపించారు. 40 ఎకరాల దళితుల భూములను ఆక్రమించినట్టు ఒప్పుకున్నాడ ని, ఆ భూమలను తిరిగి ఇచ్చేయాలని డిమాం డ్ చేశారు. లేకుంటే తానే ఆ భూముల్లో దళిత జెండాలు పాతేస్తానని హెచ్చరించారు. దళితు ల భూములు, దేవాలయ భూములను కాజేసిన ఈటలను హుజూరాబాద్ ప్రజలు ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. తన బావమరిది మ ధుసూదన్రెడ్డి దళితులను అవమానించినందుకు ఈటల ముక్కునేలకు రాయాలని మో త్కుపల్లి డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మె ల్యే రాజగోపాల్రెడ్డి ‘నేను రాజీనామా చేస్తే రూ.2 వేల కోట్లు వస్తాయి’ అని మాట్లాడ టాన్ని మోత్కుపల్లి తీవ్రంగా పరిగణించారు. రాజగోపాల్రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సంగారపు ప్రసాద్, కేవీఎల్ఎన్రావు, ముకుందరెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.