హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. దళితుల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకాన్ని అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మోత్కుపల్లి హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తా అంటున్నాడు. ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు అని స్పష్టం చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. 70 ఏండ్లలో తమ జాతికి ఏం చేశారు అని ప్రశ్నించారు. రూ. 10లక్షలు కాంగ్రెస్- బీజేపీ ఇస్తదా? ఇవాళ రూ. 10 లక్షలు ఇస్తాం అంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. దళితుల కడుపు కొడితే ఆ పాపం తప్పకుండా తగులుతుందని నర్సింహులు అన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఓడించడమే తన ధ్యేయమని, అందుకు తగ్గట్టు హుజురాబాద్లో దళిత బంధుపై ప్రచారం చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. దళితులందరూ ఏకమై సీఎం కేసీఆర్కు మద్దతు తెలపాలన్నారు. అవినీతిపరుడైన ఈటల రాజేందర్.. దళితుల భూములను వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటలను హుజురాబాద్ ఎన్నిక నుంచి బహిష్కరించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దళితబంధు పథకం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.