హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలో రాళ్లు రత్నాలుగా మారనున్నాయని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. పథకంపై కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారని.. అందరి అనుమానాలను సీఎం కేసీఆర్ వాసాలమర్రితో పటాపంచలు చేశారని పేర్కొన్నారు. దళితజనోద్ధరణ కోసం అంబేద్కర్లా పాటుపడుతున్న అభినవ అంబేద్కర్ కేసీఆర్ అని కొనియాడారు. శుక్రవారం బేగంపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో ప్రారంభించటం అత్యంత సంతోషకరంగా ఉన్నదని, అందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు అని చెప్పారు. దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన మార్గం వేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా దళితబంధును అమలుచేయించాలని డిమాండ్ చేశారు. దళితులను బాగుచేసే ఉద్దేశం సీఎం కేసీఆర్కు తప్ప మరెవరికీ లేదని పేర్కొన్నారు. దళితుల భూములను ఆక్రమించుకొన్న ఈటల రాజేందర్కు హుజూరాబాద్లో ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. సమావేశంలో ముకుందరెడ్డి, సగరపు ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.