హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ర్టాల నుంచి ఉన్న రాకపోకల వల్ల ఇక్కడా కొత్త కేసులు పెరిగాయి.
లౌక్డౌన్ ఎత్తివేశాక మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. పడక్బందీ చర్యలు తీసుకోవాలి’అని జిల్లా అధికారులను ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల బృందం ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ జిల్లాల్లో పరిశీలన జరిపేందుకు హెలికాప్టర్లో వెళ్లాలని సూచించడంతో.. రెండురోజులగా హెలికాప్టర్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో పర్యటించగా, శుక్రవారం జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పర్యటించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ,డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ ఈ బృందంలో ఉన్నారు.
ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్షలు జరిపారు. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి, కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై ఆరాతీశారు. పెద్దసంఖ్యలో పరీక్షలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. రెండువారాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేలా కృషిచేయాలని, సూచించారు. పర్యటనలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ‘ఏపీ సరిహద్దు జిల్లాల్లో పర్యటిస్తున్నాం. కొన్ని జిల్లాలు సెన్సిటివ్జోన్లో ఉన్నాయి. అక్కడ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. మూడురోజుల కిందట సత్తుపల్లి, మధిర, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పర్యటించాం. ఏపీలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దు జిల్లాల్లో కేసుల పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్హెల్త్ జీ శ్రీనివాసరావు తెలిపారు.