హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 100కుపైగా మద్యం దుకాణాలకు అనుమతిచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తర్వాత ఎక్కడెక్కడ ఏర్పాటుచేస్తారనే దానిపై స్పష్టత రానున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఏ-4 దుకాణాలు (వైన్సులు) 2,216 వరకు ఉండగా.. కొత్త మండలాలకు దుకాణాలు మంజూరు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత మద్యం పాలసీ అక్టోబర్ 31తో ముగియనున్నది. నవంబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్నది. దీని రూపకల్పనపై ఆబ్కారీశాఖ కసరత్తు ముమ్మరంచేసింది. గత పాలసీలో వైన్స్ల లైసెన్స్కు నాన్రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలు వసూలుచేశారు. అయినా దుకాణాలు దక్కించుకునేందు కు 48 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ టెండర్ దరఖాస్తుల నాన్రిఫండబుల్ ఫీజు ఎంత పెరుగుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
దళితులకు కేటాయింపు ఎలా?
దళితబంధు అమలుపై జరిగిన వివిధ సమావేశాల్లో దళితులు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నూతన మద్యం పాలసీలో కొన్ని మార్పులు చేయనున్నారు. లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు సాధ్యమేనా? కేటాయింపులు ఎలా? ఎంతమందికి కలిపి ఒక మద్యం దుకాణాన్ని కేటాయించాలి? అన్నదానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే శాసనసభ సమావేశాల్లో దళితబంధు అమలుపై చర్చ జరిగే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేయొచ్చని ఆబ్కారీశాఖ అధికారులు భావిస్తున్నారు. దళితులకు వైన్షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్పై అప్పుడే స్పష్టత వస్తుందని చెప్తున్నారు.