బన్సీలాల్పేట్, మే 31: కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. గంటకు 22 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలిగే ఈ ప్లాంట్ను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, దివీస్ ల్యాబొరేటరీస్ జనరల్ మేనేజర్ కే సుబ్బారావు సోమవారం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా దివీస్ ల్యాబోరేటరీస్ ఎండీ డాక్టర్ మురళీ ఆదేశాల మేరకు దీవీస్ ల్యాబ్, హెటిటెరో ల్యాబ్, అరబిందో ఫార్మా, ఎస్ఎంఎస్ ల్యాబ్, నాట్కో ల్యాబ్, ఎంఎస్ఎన్ ల్యాబ్ సంయుక్తంగా రూ.80 లక్షల నిధులతో దీన్ని ఏర్పాటు చేశాయి. లైబ్రరీ భవనం సమీపంలో నెలకొల్పిన ఈ నూతన ప్లాంట్లో ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ 96 శాతం నాణ్యతను కలిగి ఉన్నదని కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, ఐఏఎస్ అధికారి ప్రతిభా సింగ్, చీఫ్ ఇంజినీర్ బీ రఘు, డీఈఈ నరేందర్ నిర్థారించారు. కార్యక్రమంలో గాంధీ దవాఖాన ఆర్ఎంవో-1 డాక్టర్ నరేందర్కుమార్, డాక్టర్ సంజయ్, టీఎస్ఎంఐడీసీ ఇంజినీర్లు చంద్రప్రకాశ్, వేణు, దివీస్ ల్యాబ్ ప్రతినిధులు నాగశేఖర్, ప్రకాశ్, రాఘవేందర్రావు, అరవింద్ పాల్గొన్నారు.