పిల్లల పట్ల తల్లిదండ్రుల వివక్ష
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా తల్లిదండ్రులు మాత్రం వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారని సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది. కొడుకులను ప్రైవేటు స్కూళ్లకు కూతుళ్లను సర్కారు బడులకు పంపుతూ లింగ వివక్ష చూపుతున్నారని తెలిపింది. ఆసర్ 2020 నివేదికను ప్రామాణికంగా తీసుకుని కొన్ని గణాంకాలను వివరించింది. ఏడు నుంచి పదేండ్లలోపు వారిలో 50.5 శాతంమంది బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా, 49.8 శాతం మంది బాలురు ప్రైవేటు స్కూళ్లకు వెళుతున్నారు. ఇక 11 నుంచి 16 ఏండ్ల మధ్య వారిలో 67 శాతం బాలికలు సర్కారు బడులకు వెళుతుండగా, 25 శాతం మంది మాత్రమే ప్రైవేటు విద్యను పొందుతున్నారు. బాలల్లో మాత్రం 58.2 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళుతుండగా, 34.8 శాతం మందిని ప్రైవేటులో చేర్పిస్తున్నారు. ఉన్నత విద్యను ఇప్పించే విషయంలో మాత్రం తల్లిదండ్రుల ద్రుక్పథంలో కొద్దిగా మార్పు వచ్చినట్టు ఆ నివేదిక అభిప్రాయపడింది.