ప్రత్యేక ప్రతినిధి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం కచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రశంసించింది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితికి లోబడే ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర రెవిన్యూ రాబడితోపాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని పేర్కొన్నది. ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నదని తెలిపింది. సామాజిక సంక్షేమం, వ్యవసాయరంగాలపై పెట్టుబడులు భారీగా పెరిగాయని వెల్లడించింది. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ రూపొందించిన నివేదికను శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో రెవెన్యూ రాబడి 2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో మెరుగయ్యిందని కాగ్ తెలిపింది. మూలధన వ్యయం 2018-19లో అంతకుముందు ఏడాదితో పోల్చితే తగ్గింది. రుణ పరిమితి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో (జీఎస్డీపీ) లో 3.25 శాతంగా ఉండాలని 14వ ఆర్థికసంఘం నిర్దేశించగా, రాష్ట్రంలో అంతకంటే తక్కువగానే ఉన్నదని పేర్కొంది.
సమర్థంగా పన్ను వసూళ్లు
పన్ను వసూళ్లలో రాష్ట్రప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తున్నదని కాగ్ ప్రశంసించింది. వర్తకం, వస్తుసేవలు, ఆబ్కారీ పన్నుల వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని పేర్కొంది. తలసరి ఖర్చు పెరిగిందని, దీనిలో వ్యవసాయానికి ప్రాధాన్యం దక్కిందని వివరించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రంగాలపై తలసరి ఖర్చు గణనీయంగా పెరిగి 12.4 శాతం వృద్ధి నమోదుచేసిందని వెల్లడించింది. రవాణా, విద్య, క్రీడలపై ప్రభుత్వ వ్యయం తగ్గిందని కాగ్ విశ్లేషించింది.