హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వేయికిపైగా ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోయినట్టు ప్రాథమిక సమాచారం అందిందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇప్పటికీ చాలా ట్రాన్స్ఫార్మర్లు నీటిలోనే ఉన్నాయని, అవన్నీ నీటి నుంచి బయటపడితేగానీ నష్టం అంచనా పూర్తిగా వేయగలమని తెలిపారు. అత్యధికంగా ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలోనే నష్టం వాటిల్లిందని వివరించారు. ఇదిలా ఉండగా.. ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగిన ప్రదేశాల్లో ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్తును పునరుద్ధరించారు. రాష్ట్రంలో సుమారు వేయి వరకు విద్యుత్తు స్థంభాలకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. హనుమకొండలోని రెండు సబ్స్టేషన్లలోకి నీళ్లు రావడంతో వెంటనే ట్రిప్ చేసి, ప్రత్యామ్నాయ సబ్స్టేషన్ల ద్వారా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు.