కేతేపల్లి: గత నెల 28 నుంచి ఈ నెల 16 వరకు 20 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగిన మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలను గురువారం అధికారులు నిలిపివేశారు. వర్షాలు తగ్గి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కూడా తగ్గు ముఖం పట్టింది. దీంతో అధికారులు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 431.71 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాలువలకు 283 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా 46 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుంది.
పూర్తి స్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 642.10(3.71 టీఎంసీలు) అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూలై 14 నుంచి 27 వరకు 14 రోజుల వ్యవధిలో ప్రాజెక్టు నుంచి 6.60 టీఎంసీల నీటిని దిగువ కు వదిలిన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 28 నుంచి ఈ నెల16 వరకు 20 రోజుల వ్యవధిలో 2.80 టీఎంసీల నీరు దిగువకు వెళ్లింది. ఇప్పటి వరకు ఈ ఏడాది 9.40 టీఎంసీల నీటిని దిగువ మూసీలోకి వెళ్లింది.