హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నైరుతీ రుతుపవనాలు రెండు రోజులుగా మందగించాయి. కేరళ తీరం నుంచి ముందుకు కదలిన రుతుపవనాలు ఈ నెల 6 వరకు చురుకుగా ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమ గాలులు బలంగా లేకపోవడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోనే విస్తరించాయి. అయితే ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున రుతుపవనాలు వేగం పుంజుకోవచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. మూడురోజుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రుతుపవనాలు ఇప్పటివరకు మెదక్, నల్లగొండ జిల్లాలలో మాత్రమే ప్రవేశించాయి. మరోవైపు మరఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. ఇదిలా ఉండగా రాగల 48గంటలలో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. గంటకి 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు.
గ్రేటర్లో విస్తారంగా వానలు
గ్రేటర్ హైదరాబాద్లో ఈ నెల 11నుంచి వానలు విస్తారంగే కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో నేడు, రేపు నగరంలోని కొన్ని చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ట ఉష్ణోగ్రత 35.6డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.0డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 44శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.