హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఏర్పాట్లపై గురువారం శాసనసభ కమిటీ హాల్లో పోలీసుశాఖ, ఇతర అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సమావేశమయ్యారు. మండలి చైర్మన్ ప్రొటెం వీ భూపాల్రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, శాసనసభ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశాలు పారదర్శకంగా జరిగేలా అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం సూచించారు.
సభ సజావుగా జరగాలంటే సభ బయట, శాసనసభ పరిసరాల్లో ప్రశాంతత ఉండాలని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సభ్యులు అడిగిన సమాచారం వెంటనే అందజేయాలని తెలిపారు. ఆయా శాఖల తరపున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గత సమావేశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రశ్నల సమాధానాలు తక్షణమే పంపించాలని చెప్పారు. సభ్యులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అధికార, ప్రతిపక్ష ం అనే తేడాలేకుండా ప్రజా సమస్యలను సభల్లో ప్రస్తావించడానికి కావలసినంత సమయం కేటాయిస్తామని, అయితే సభ్యులు అర్ధవంతమైన చర్చకు సహకరించాలని చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్రెడ్డి సూచించారు.
పలువురు మాజీ సభ్యులకు సంతాపం
శాసనసభ, మండలి ఉదయం సమావేశమయ్యాక ముందుగా ఇటీవల మృతిచెందిన మాజీ సభ్యులకు సం తాపం తెలుపనున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కుంజ బొజ్జి, అజ్మీరా చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, కుంజ భిక్షం, ఎం సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, రాజయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చెరుకూరి కాశయ్యకు అసెంబ్లీ నివాళులు అర్పించనున్న ది. మాజీ ఎమ్మెల్సీలు రెహమాన్, లింబారెడ్డి, లక్ష్మారెడ్డి, ముత్యంరెడ్డికి మండలి నివాళి తెలుపనున్నది. అనంతరం శాసనసభలో పలు ఆర్డినెన్స్ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ ఆర్డినెన్స్ బిల్లును ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కొం డాలక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీకి సంబంధించి ఆర్డినెన్స్ బిల్లును వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన 3వ వార్షిక నివేదికను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 2018-19 వార్షిక నివేదికతోపాటు, నార్తర్న్, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, తెలంగాణ పవర్ ఫైనా న్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికలను విద్యుత్తు మంత్రి జగదీశ్రెడ్డి, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2014-15 సంవత్సరం వార్షిక నివేదికను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, 2019-20 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ సమగ్ర శిక్షా ఆడిట్రిపోర్ట్ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులను, బిల్లులను మండలిలోనూ ప్రవేశపెడతారు.