హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించిన విషయం విదితమే. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీచనున్నాయి. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, ఇవాళ ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.