హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): సాధారణ లక్షణాలున్న కరోనా రోగులకు చికిత్సలో భాగంగా మోల్నుపిరవిర్ మాత్రల క్లినికల్ టయల్స్ శుక్రవారం సోమాజీగూడ యశోద దవాఖానలో ప్రారంభమయ్యాయి. ఈ మాత్రల మూడోదశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోనే మొదటిసారిగా యశోదలో ప్రారంభించినట్టు దవాఖాన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి మైల్డ్, మోడరేట్ లక్షణాలున్నవారికి చికిత్స అందించడంలో వినియోగించే మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్లను డీసీజీఐ అనుమతి పొందిన నాట్కోఫార్మాతో కలిసి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో కరోనా సోకినవారికి (వలంటీర్లు) ఐదు రోజులపాటు రోజుకు రెండుసార్లు మోల్ను ఫిరావిర్ 400 ఎంజీ మాత్రలు ఇస్తున్నారు. ఐదో రోజు, పదో రోజు, 15వరోజు వారి ఆరోగ్యపరిస్థితిని పరిశీలిస్తారని.. 30 రోజుల తర్వాత ఔషధం ప్రాధాన్యాన్ని గుర్తిస్తామని పేర్కొన్నారు. 18-60 ఏండ్ల వయస్కులవారిపై ప్రయోగాన్ని యశోద హస్పిటల్స్ పరిధిలో 2నెలలపాటు చేపడతామని తెలిపారు. మోల్నుపిరవిర్ ప్రీ క్లినిల్ ట్రయల్లో జంతువులపై జరిగిన అధ్యయనాల్లో ఎస్ఏఆర్ఎస్ సీఓవీ-2 వైరస్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించిట్టు వెల్లడైందని చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్లో ఫేజ్-1, యూఎస్ఏలో ఫేజ్- 2 క్లినికల్ ట్రయల్స్ కూడా సత్ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు.