పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 22: ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం జన్ధన్ ఖాతాల్లో నిధులు ఎక్కడ జమచేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. బుధవారం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ఊర చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారన్నారు. ఎన్నికల ముందు ప్రతి కుటుంబానికి జన్ధన్ ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని చెప్పారని, ఏ ఒక్కరి ఖాతాలోనూ రూపాయి కూడా జమ కాలేదన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి పేదలు, సామాన్యులపై భారం మోపారని మండిపడ్డారు. దొడ్డు వడ్లను కొనబోమని కేంద్రం ప్రకటించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఇప్పటికైనా మేల్కొని యాసంగిలో సన్న వడ్లు పండించాలని సూచించారు.