బంజారాహిల్స్,మే 22: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించి కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. నిర్దేశిత సమయాల్లో మాత్రమే షాపులను, వ్యాపార సంస్థలను నడిపేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా లాక్డౌన్ సమయాల్లో కూడా బయటకు వచ్చి పోలీసులకు చిక్కుతున్న కొంతమంది వాహనదారులు చిత్ర విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. లాక్డౌన్ వేళల్లో బయటకు వస్తున్న వారిలో ఎక్కువమంది ఆస్పత్రులకు వెళ్లేవారు కాగా.. మరికొంతమంది అత్యవసర సేవల్లో పాల్గొనే వారున్నారు. వీరితో పాటు సడలింపులు ఇచ్చిన వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే, లాక్డౌన్ ఉన్న విషయం తెలిసినప్పటికీ కొంతమంది అకారణంగా బయటకు వచ్చి విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. ఆలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద పోలీసులకు చిక్కిన వాహనదారులు చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి.