హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని.. దరఖాస్తుల ఉద్యమం అంటూ కొత్త రాగమెత్తుకొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రభుత్వానికి దరఖాస్తుల మాటేమిటో కానీ.. బండికే బండెడు దరఖాస్తులు ట్విట్టర్లోనే వచ్చిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ పథకాల మంజూరు కోరుతూ దరఖాస్తులు ఇవ్వాలని ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కానీ ప్రజలేమో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరుగా బండి సంజయ్కే దరఖాస్తులు పంపిం చి రివర్స్ షాకిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్క రి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని బండిని ప్రజలు ట్విట్టర్లో ప్రశ్నించారు. ముందుగా మోదీకి చెప్పి రూ.15 లక్షలు తమ జన్ధన్ ఖాతాల్లో ధనాధన్ జమచేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బండి సంజయ్కి దరఖాస్తులు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడేండ్లుగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా అమలుచేస్తున్నది. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదు. తమ పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించే ధైర్యంలేని బండి… సంక్షేమ పథకాలను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కుట్రకు తెరతీశారు.
అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు పొందలేనివారు తనకు దరఖాస్తు ఇవ్వాలని బండి పిలుపునిచ్చారు. ఆయనకు ఒక్క దరఖాస్తు అయినా వస్తుందా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాకు ఆసరా పింఛన్లు అందుతున్నయి.. కల్యాణలక్ష్మి పైసలు అందుతున్నయి.. కేసీఆర్ కిట్ అందుతున్నది..మద్దతు ధర దక్కుతుంది. రైతుబంధు పైసలు అందుతున్నయి.. రైతుబీమా పరిహారం అందుతున్నది.. ఇంకా నీకు దరఖాస్తు ఎందుకు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా.. దళితుల బతుకులను బాగు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. అర్హులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధులో భాగంగా రూ. 10 లక్షలు ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు. మరి ఇంకెందుకు బండి సంజయ్కు దరఖాస్తు పెట్టుకోవాలి? ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ అర్హత వయస్సు కూడా తగ్గించారు. మరి ఇంకెందుకు నీకు దరఖాస్తు చేసుకోవాలి..? అంటూ తెలంగాణ ప్రజలు బండి సంజయ్ను ప్రశ్నిస్తున్నారు. ‘నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు కేంద్రానికి చెప్పి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడు’ అని బండికి ప్రజలు చురకలంటిస్తున్నారు.