హైదరాబాద్ : తెలంగాణలోని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ ఈ నెల 22.
ఇక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పురుష ఓటర్లు 3,22,918, మహిళా ఓటర్లు 3,29,872, థర్డ్ జెండర్ 176 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పురుష ఓటర్లు 1,35,734, మహిళా ఓటర్లు 1,45,608, థర్డ్ జెండర్ 45 మంది ఓటర్లు ఉన్నారు.
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో పురుష ఓటర్లు 10,100, మహిళా ఓటర్లు 10,428, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 49,875, మహిళా ఓటర్లు 50,765, థర్డ్ జెండర్ 11 మంది ఓటర్లు ఉన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 10,342, మహిళా ఓటర్లు 10,693 మంది ఓటర్లు ఉండగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పురుష ఓటర్లు 20,765, మహిళా ఓటర్లు 20,749 మంది, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 4,128, మహిళా ఓటర్లు 4,006, ఇద్దరు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికల కోసం మొత్తం 1532 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 2,479 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి..