హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించటానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఆరోపించారు. సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన పాదయాత్రకు ప్రజల మద్దతు లేదని, ఈ యాత్రతో బీజేపీకి ఉన్న రెండు సీట్లూ పోతాయని చెప్పారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బండి సంజయ్ జైలుకు పోవుడు ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేసి, సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అద్వితీయంగా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్పై బండి సంజయ్ ఇష్టారీతిగా నోరుపారేసుకుంటే తాము ఊరుకోబోమని స్పష్టంచేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్రతో అధికారంలోకి రాలేదని, ఆనాడు టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటం వల్లే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న సంగతిని బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ భయపడిపోయి ప్రధాని మోదీని కలిశారనడం అర్థరహితమని, భయపడే నైజం కేసీఆర్ డిక్షనరీలోనే లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానిని కలిస్తే బీజేపీ రాష్ట్ర నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కేవలం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను విమర్శించటం మాని ఢిల్లీలో తమ గద్దెను కాపాడుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ ఈ రాష్ర్టానికి ఏం చేసింది.. రేపు ఏం చేయబోతున్నదో సంజయ్ పాదయాత్రలో చెప్పాలని డిమాండ్ చేశారు.