కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంటి పథకాన్ని మాజీ మంత్రి ఈటల పరిగెతో పోల్చారన్నారు. హుజూరాబాద్ మండలం చేర్పూర్ రైతు వేదిక ప్రారంభం అనంతరం ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ.. రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్ లలో పడుతుండటంతో గత వారం రోజుల నుండి రైతుల ఫోన్లు మోగుతూనే ఉన్నాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 25 రైతు వేదికలకుగాను ఇంకా 9 ప్రారంభం కావాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్ కి కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం. రైతుబంధు ఇక్కడి నుండి ప్రారంభించారు.
ఒక్క గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా అమలు అవుతుంది. బీమా కింద 5 లక్షలు చెల్లిస్తున్నారు. నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్తు రైతులకు అందిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతుల కరెంటు కనెక్షన్లకు 106 మీటర్లు బిగిస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 850 కల్లాలు నిర్మించడం జరిగింది. ఈటెల రాజేందర్ రైతుబంధును అవహేళన చేశారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను విమర్శించారు. పరిగే ఏరుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. దళితుల కోసం వేల కోట్లతో కొత్త పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకువస్తున్నట్లు చెప్పారు.