సిద్దిపేట : వెదజల్లే పద్దతిలో వరిసాగు చేపట్టాల్సిందిగా రైతులను సీఎం కేసీఆర్ కోరారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్, పోలీసు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన స్వంత వ్యవసాయక్షేత్రంలో వెదజల్లే వరిసాగు అనుభవాన్ని సీఎం పంచుకున్నారు. ఈ పద్దతిలో గతేడాది ఎకరానికి 42 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు తెలిపారు. సాధారణ పద్దతిలో కంటే ఇది ఎక్కువన్నారు.
మడులల్లో నారు పెంచి నాట్లు వేసే పద్దతిలో శ్రమ, వ్యయం ఎక్కువన్నారు. అదే వెదసాగులో ఎకరాకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చులు తగ్గుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పంటకాలం సైతం పది రోజులు తగ్గుతున్నట్లు వివరించారు. మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులు రైతు వేదికల ద్వారా తరచుగా సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు. రైతులు కూడా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను మార్చాలన్నారు.
రాష్ట్రంలో కావాల్సినన్ని రైస్ మిల్లులు లేవన్నారు. కావునా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మిల్లులు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో 60 గా ఉన్న జిన్నింగ్ మిల్లులు గత ఏడేళ్లలో 400 కు చేరుకున్నట్లు తెలిపారు. రైతు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అని తెలిపిన సీఎం రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉంచిత విద్యుత్ ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.