హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఐటీ రంగంలో రూ.2 లక్షల 55 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దాదాపు 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్థిక వృద్ధిరేటు 128 శాతం పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 11 లక్షల 48 వేల కోట్లకు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.3 లక్షల 17 వేలుగా ఉందని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని విమర్శించారు. ఒక్క ఐఐటీ కూడా లేదని, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదన్నారు. విభజన హామీల్లో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ సంగతి మరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అదానికి కట్టబెట్టేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే.. కేంద్రం మాత్రం ఉన్న సంపదను అమ్మేస్తున్నదని విమర్శించారు. చివరికి ఎల్ఐసీని కూడా అదాని కాళ్లదగ్గర పెట్టారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు అధిక వేతనాలు అందిస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలు దేశం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.