న్యూఢిల్లీ, జూలై 1: వంటింటి బడ్జెట్ తలకిందులవుతున్నది. పెరుగుతున్న గ్యాస్, వంటనూనెలకుతోడు పాలు, పండ్లు, పప్పులు, కూరగాయల ధరలూ చేరాయి. మాంసం, గుడ్లు, చేపల రేట్లు సరేసరి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు తప్పట్లేదు. అసలే కరోనా వైరస్ సంక్షోభంతో అందరి ఆదాయాలూ ప్రభావితమైయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. కిచెన్ ఖర్చులను అమాంతం పెంచేస్తున్నది.
పెట్రో సెగలతోనే..
సెంచరీలు కొడుతున్న పెట్రో ధరలు.. మార్కెట్లోని ప్రతి వస్తువుపైనా ప్రతాపం చూపిస్తున్నాయి. భారంగా మారుతున్న రవాణా.. ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది. కిలో వంటనూనె ధర రూ.180 వరకు ఉండగా, పప్పులు రూ. 130దాకా పలుకుతున్నాయి. కూరగాయలూ కిలో రూ.40 నుంచి 60కి తగ్గకుండా ఉండగా, కిలో చికెన్ కోసం రూ.200లైనా వెచ్చించాల్సి వస్తున్నదన్నది సగటు మధ్యతరగతి మనిషి ఆందోళన. మరోవైపు ధరలను అదుపు చేయకపోతే వినిమయ సామర్థ్యం తగ్గి.. మార్కెట్ మందగమనంలోకి జారుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వంటగ్యాస్ ధరలకు రెక్కలు
అంతకంతకూ పెరుగుతూపోతున్న వంటగ్యాస్ ధరలు కూడా వంటింటి ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి 14.2 కిలోల సిలిండర్ ధర రూ.240 మేర ఎగబాకింది. గురువారం రూ.25.5 పెరుగడంతో హైదరాబాద్లో నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.887ను తాకింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.76.5 పెరిగి రూ.1,550గా ఉన్నది. ఇక పెట్రోల్ ధర ఇప్పటికే మూడంకెల స్థాయిని అందుకోగా, డీజిల్ రేటు వందకు సమీపిస్తున్నది.