ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్
వైద్యాధికారులతోసమీక్షా సమావేశం
ఎదులాపురం, జూన్ 5: జిల్లాలో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలతో పాటు ఇంటింటా సర్వే, వ్యాక్సినేషన్తో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థ్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వైద్యాధికారితో కలిసి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడుతల్లో 1,92,307 ఇండ్లు సర్వే చేసినట్లు తెలిపారు. 9,582 మందిలో లక్షణాలు ఉన్నాయని, వారిని హోం ఐసొలేషన్లో ఉంచి కిట్లు పంపిణీ చేశామన్నారు. జిల్లా సరిహద్దులో డొల్లరా, కొబ్బయి, లక్ష్మీపూర్, ఘన్పూర్ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి 7,266 మందికి స్క్రీనింగ్ చేశామన్నారు. ఇందులో 82 మందికి ఫీవర్ కేసులు గుర్తించామని, మరో 39 మందికి ఆర్ఏటీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్గా వచ్చిందని చెప్పారు. జిల్లాలో 16,196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలి పారు. 15,938 మంది కొవిడ్ నుంచి కోలుకు న్నారని, 83 మంది మృతి చెందారని తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ దవాఖానల్లో 591 ఐసీయూ పడకలు, కొవిడ్ కేంద్రాల్లో 322 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో 69,960 మందికి టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 51,582 మందికి మొదటి డోస్, 18,378 మందికి రెండో డోస్ అందించామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరింత జాగ్రత్తగా ఉండేలా ప్రచారం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ,రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం నాయక్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, జిల్లా సర్వైవ్లెన్స్ అధికారి వైసీ శ్రీనివాస్, డీపీవో శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్ పాల్గొన్నారు.