పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
12(బి) సాధనకు కృషి చేయండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ మల్లేశంతో భేటీ
కమాన్చౌరస్తా, మే 27 : శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రభుత్వ పరంగా తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో వినోద్కుమార్ను శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధితోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, తాను ఎంపీగా ఉన్న కాలంలో శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకుని వచ్చామని, ఈ క్రమంలోనే ఫార్మసీ విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 12(బి) సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శాతవాహన యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు పెంచేందుకు, యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం, వీసీ మల్లేశం మాట్లాడుతూ, అందరి సహకారంతో యూనివర్సిటీ బలోపేతంతోపాటు విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.