ఖలీల్వాడి, జూన్ 11: ఎమ్మెల్సీ కవిత మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్కు చెందిన ఐదునెలల చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శుక్రవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవితను మోక్ష తండ్రి కలిసి బాలిక ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చిన్నారికి గతంలో ఒకసారి ఆపరేషన్ అయ్యిందని మరో రెండు ఆపరేషన్లు చేయాల్సి ఉన్నదని తెలిపాడు. ఈ సందర్భంగా మోక్షకు మెరుగైన వైద్యం అందేలా ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు.
విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు, వారి సహాయకులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా భోజన వితరణ చేపట్టడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. నిజామాబాద్లో ఎమ్మెల్యే చేపట్టిన భోజనాల తయారీ కేంద్రాన్ని గణేశ్ గుప్తాతోపాటు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలతో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో 36 రోజులుగా ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆయన తండ్రి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం భోజనాలు తయారు చేయించి బాధితుల ఇండ్లకే పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. కరోనా అంతరించి పోయిందని భావించకుండా కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆమె ప్రజలను కోరారు. ఉచిత భోజన వితరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా 36 రోజులుగా భోజన తయారీ కేంద్రంలో పని చేస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా దుస్తులు పంపిణీచేశారు.