ప్రజల్లో భక్తి భావం పెంపొందించి, ఆధ్యాత్మిక భావనను చాటి చెప్పడమే లక్ష్యంగా గడప గడపకూ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో ఇటీవ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 82 రోజుల పాటు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల పరిధిలోని ఆలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరిపేలా నిర్వాహకులు దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. కార్మికులు, శ్రామికులు, కర్షకులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
రామకోటి స్తూపం..
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కల్వకుంట్ల కవిత నేతృత్వంలో రామకోటి స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి భూమి పూజ నిర్వహించామని, రామకోటి స్తూపంలో 11కోట్ల శ్రీరామ నామ పుస్తకాలను భద్రపరచి శాస్ర్తోక్తంగా బ్రాహ్మణులు, వేద పండితుల చేత హనుమాన్ జయంతి సందర్భంగా రామకోటి స్తూపం ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంట్లో అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని 82 రోజుల పాటు జరిపేలా చేపట్టిన ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని దూపదీప నైవేధ్య పథకం అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ పిలుపునిచ్చారు. ఈనెల 17న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 4వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కొండగట్టు ఆంజనేయ స్వామి కటాక్షం పొందాలని ఆకాంక్షించారు.