వరంగల్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నవారికి అండగా ఉండడానికి బాలవికాస స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సహకారంతో బాలవికాస సంస్థ ప్రతినిధులు గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతులమీదుగా వరంగల్ ఎంజీఎంకు 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డిని మంత్రి అభినందించారు. అంతకుముందు.. మంత్రి ఎర్రబెల్లి వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ను తనిఖీ చేశారు. డాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నదని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పేదలకు వైద్యం అందిస్తున్న ఎంజీఎం హాస్పిటల్పై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, దీన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.