జగిత్యాల, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో రోగులకు, బాధిత కుటుంబాలకు ‘నేనున్నానంటూ’ అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బాధితులతో నేరుగా మాట్లాడుతూ భరోసా కల్పిస్తూనే, కొరత ఉన్న చోట టెస్టింగ్ కిట్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను సమకూరుస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. గతేడాది లాక్డౌన్ టైంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఆమె, ప్రస్తుతం అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. కొవిడ్ పేషెంట్లకు సాయం కోసం తన కార్యాలయంలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసి బాసటగా నిలుస్తున్నారు. ఈ మేరకు హెల్ప్లైన్ సేవలపై గురువారం హైదరాబాద్లో సమీక్షించారు. హెల్ప్లైన్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు దవాఖానల వైద్యులు, కరోనా పేషెంట్లతో ఫోన్లో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కరోనాను ఎదురొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు.
మూడు నంబర్లతో హెల్ప్లైన్
మహారాష్ట్రతో సరిహద్దులో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కేసులు ఎకువగా నమోదవుతుండగా, ప్రజలకు సహాయ సహకారాల కోసం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999, 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 నంబర్లతో ప్రత్యేక 24/7 హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ సెంటర్లను నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి సాయం కోసం రోజూ వందల మంది బాధితులు సంప్రదిస్తున్నారు.
స్వయంగా పర్యవేక్షిస్తున్న కవిత
కాల్ సెంటర్లకు వచ్చే ప్రతి విజ్ఞప్తిని ఎమ్మెల్సీ కవిత నేరుగా పర్యవేక్షిస్తూ దవాఖానల్లో బెడ్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అన్ని విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ కరోనా పేషెంట్లకు, వారి కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఒకవేళ జిల్లా దవాఖానల్లో బెడ్ అందుబాటులో లేకపోతే బాధితులను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్లో ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ ద్వారా హోం ఐసొలేషన్లో ఉన్నవారికి మందులు, ఆహారం నేరుగా చేరవేస్తున్నారు. ఇలా హెల్ప్లైన్, ట్విట్టర్ ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్న కవితపై ప్రజలు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.