సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ) :టింబర్ డిపో వ్యాపారి కిడ్నాప్ కేసులో రాచకొండ పోలీసులు సోమవారం ఏడుగురిని అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ డిఫెన్స్ కాలనీలో ఆరిఫ్ అక్బానీ కైఫ్ టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2 న సాయంత్రం 6 గంటల సమయంలో దాదాపు పదిమంది డిపోలోకి ప్రవేశించి, సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి ఆరిఫ్ అక్బానీ కైఫ్ను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. రెండు వాహనాల్లో టేకు కట్టెలను నింపుకుని పారిపోయారు. ఇది గమనించిన యజమాని డ్రైవర్ అమీర్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటిరోజు నాగ్పూర్లో క్షేమంగా ఉన్నట్లు ఆరిఫ్ ఫోన్ ద్వారా తెలిపాడు. ఈ విషయాన్ని కిడ్నాపర్లు బలవంతంగా చెప్పించారనే భావనతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. కిడ్నాప్లో పాల్గొన్న మహ్మద్ ఫజ్లాని, తారీఖ్ అమీన్ ఫజ్లాని, నదీమ్, షాకూర్ సాయని, ఇమ్రాన్, ఇమ్రాన్ ఘాజీ, సంతోష్ మాసీలను సోమవారం అత్తాపూర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కోటి రూపాయల ఆర్థిక లావాదేవీల విషయంలో సోదరుల మధ్య నెలకొన్న వివాదమే కిడ్నాప్నకు దారితీసినట్లు విచారణలో తేలింది.