బొంరాస్పేట, జూన్ 28 : ఐకేపీ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనాతో మృతిచెందితే వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణాలు అందజేస్తున్నట్లు డీఆర్డీఏ ఏపీడీ నర్సింహులు, డీపీఎం వీరయ్య, రాంమూర్తి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్, దోమ, కులకచర్ల మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలతో ఆయా మండలాల్లోని ఐకేపీ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.3 లక్షల రుణంలో 20 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జాతీయ గ్రామీణ జీవనోపాధుల పథకం(ఎన్ఆర్ఎల్ఎం)లో భాగంగా అన్ని మండలాల్లోని పొదుపు సంఘాల్లోని మహిళల ఫొటో క్యాప్చర్ కార్యక్రమం వేగవంతం చేయాలని ఐకేపీ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారా అందించే రుణాల లక్ష్యం, గ్రౌండింగ్, రికవరీపై వారు తెలుసుకున్నారు. మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చూడాలన్నారు. మార్కెటింగ్లో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను త్వరగా ఆన్లైన్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సంఘం అధ్యక్షురాలు బుజ్జమ్మ, కార్యదర్శి గోవిందమ్మ, స్త్రీనిధి ఆర్ఎం వేణు, మేనేజరు సంతోష్, ఏపీఎం రామచందర్, సీసీలు యాదయ్య, సత్యం పాల్గొన్నారు.