ఏడాదిన్నరలోనే మారిన రూపురేఖలు
పల్లె ప్రగతితో అభివృద్ధిలోనూ పరుగులు
నిత్య పారిశుధ్య కార్యక్రమాలతో శుభ్రంగా గ్రామం
ముచ్చటగొలుపుతున్న పల్లె ప్రకృతివనం
సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆదర్శం
వీర్నపల్లి, మార్చి21:నెలనెలా వస్తున్న పల్లె ప్రగతి నిధులతో కంచర్ల అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. వాడవాడలా అద్దాల్లాంటి రోడ్లు, శుభ్రమైన డ్రైనేజీలతో కొత్తరూపును సంతరించుకొన్నది. రహదారులు, ఇండ్ల ముంగిట ఏపుగా పెరిగిన మొక్కలతో హరిత సొబగులు అద్దుకున్నది. తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతివనం ముచ్చటగొలుపుతుండగా, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, నిత్య పారిశుధ్య కార్యక్రమాలతో స్వచ్ఛగ్రామంగా రూపుదిద్దుకున్నది.
కంచర్ల. వీర్నపల్లి మండలంలోని మారుమూల గ్రామం. 1122 జనాభా, 311 నివాస గృహాలున్నాయి. అన్ని గ్రామాల్లానే కంచర్ల మొన్నటిదాక సమస్యలతో సతమతమైంది. పారిశుధ్యలోపంతో తీవ్ర అవస్థలు పడ్డది. అరకొర నిధులు, అర్ధాంతరంగా నిలిచిన పనులతో సతమతమైంది. కానీ రాష్ట్ర సర్కారు తెచ్చిన పల్లె ప్రగతి కింద సరికొత్త అందాలు అద్దుకొని అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామస్తుల సమష్టి కృషితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నది.
ఐక్యతతో ముందుకు..
పల్లె ప్రగతి మొదలైన తర్వాత ముందుగా స్వచ్ఛతపైనే దృష్టి పెట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త వేరు చేసేలా అవగాహన కల్పించడంతోపాటు ట్రాలీ, ట్యాంకర్తో కూడిన ట్రాక్టర్ను సమకూర్చుకొని నిత్యం చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అలాగే వీధుల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటుండంతో వీధులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇంకా కంచర్ల బస్టాండ్ వద్ద రెండెకరాల స్థలంలో 4వేల మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వనంలో గార్డెన్ను ఏర్పాటు చేసి, మొక్కలకు వివిధ రకాల రంగులు వేయడంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంకా రూ.11లక్షల వ్యయంతో గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించుకున్నారు. కొత్త స్తంభాలు వేసుకున్నారు. రూ.2.50లక్షలతో కంపోస్ట్ షెడ్ను నిర్మించుకున్నారు. వైకుంఠధామం పనులు చివరి దశకు చేరా యి. గ్రామ ప్రధాన రహదారికి ఇరువైపులా 1 600, గ్రామ వీధుల్లో ఇరువైపులా 1200 మొక్కలను నాటగా, ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇక గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి 20వేల మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, పూల మొక్కలు ఉన్నాయి.
పల్లె ప్రగతి వరం..
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి మాకు వరంలా మారింది. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్నాం. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో గ్రామంలో పచ్చదనం పరుచుకుంది. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చుతున్నాం.