హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఊరూరా అన్నదానాలు.. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కవిత బర్త్డేను ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్ అశోక్నగర్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. బర్త్డే కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. 30 మంది విద్యార్థినులకు సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన మెకానిక్ ఆదిలక్ష్మికి అధునాతన పరికరాలను అందజేశారు.
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా దోహలో టీఆర్ఎస్ ఖతర్శాఖ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జాగృతి ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు శ్రీకర్రెడ్డి అండెం ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని ఓ పార్కును శుభ్రం చేశారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా తల్లి శోభతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతిభవన్లో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు తనకెంతో ప్రత్యేకమన్నారు. అన్నయ్యతో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేయడం, పుట్టినరోజు సందర్భంగా తనను అందులో భాగస్వామ్యం చేయడం గొప్ప బహుమతి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం పట్ల సంతోష్కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ‘ఈ రోజుకు ఒక గొప్ప ప్రారంభం లభించింది. నా ఆత్మీయ సోదరి కవిత తన పుట్టిన రోజు సందర్భంగా పెద్దమ్మతో కలిసి మొక్కలునాటడం సంతోషం కల్గించింది’ అని ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, నాటిన మొక్కతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటో పోస్టు చేశారు.
ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని రవీంద్రభారతిలో మహారాష్ట్రకు చెందిన చిత్రకారుడు శైలేశ్ కులకర్ణి.. రంగులతో 60 అడుగుల భారీ చిత్రాన్ని రూపొందించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తదితరులు ఈ చిత్రం వద్ద కేక్ కట్చేశారు.