కొడంగల్, మే 4 : గ్రామాభివృద్ధిలో భాగంగా 30 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. పూర్తి స్థాయిలో స్వచ్ఛతతో పాటు అభివృద్ధిని సాధించాయి. పచ్చటి అందాలు, అందమైన సీసీ రోడ్లు, చెత్త సేకరణకు వాహనాలు, డంపింగ్ యార్డ్లు, పురాతన భవనాల కూల్చివేత, పాడుబడ్డ బావుల పూడ్చివేతతో పాటు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. నాడు కూరుకుపోయిన చెత్తకుప్పలు నేడు ప్రకృతి వనాలతో పచ్చటి ఆహ్లాదకర వాతావరణం వెల్లివిరుస్తున్నాయి.
మండలంలోని అన్నారం గ్రామంలో 3000ల జనాభా, 1800మంది ఓటర్లు, దాదాపు 800 ఇండ్లు ఉన్నాయి. వీధుల్లో సీసీ రోడ్లు నిర్మాణం, గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ చెత్తను సేకరించడం వల్ల గ్రామంలో చెత్త కుప్పలు లేకుండా స్వచ్ఛత సంతరించుకున్నది. ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో 30 రోజుల్లో గ్రామ స్వరూపం మారిపోయింది.
దాదాపు రూ.30లక్షలతో అభివృద్ధి పనులు..
గ్రామంలో రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనుల నిర్వహణకు రూ.30లక్షల పైగా నిధులు మంజూరయ్యాయి. రూ.4లక్షలతో సీసీ రోడ్లు, రూ.6లక్షలతో పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీ, రూ.2.50లక్షలతో కంపోస్ట్షెడ్, రూ.60వేలతో డంపింగ్యార్డ్, రూ.10లక్షలతో వైకుంఠధామం, రూ.9లక్షల 50వేలతో ట్రాక్టర్, ట్రాలీ, డోజర్తో పాటు ట్యాంక్, గ్రామంలోని గుంతలను పూడ్చివేత, గ్రామ అంతర్గత రోడ్లుకు మొరం పనులు, చదును చేయిండం వంటి పనులు చేపట్టారు.
పల్లె ప్రకృతి వనం..
పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 20 గుంటల స్థలంలో ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, 16 రకాల పూలు, పండ్లు, షో తదితర మొక్కలను 800లకు పైగా నాటి సంరక్షిస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరిగి పచ్చటి వాతావరణాన్ని అందిస్తున్నాయి. గ్రామ ప్రధాన రహదారిపై 400 మొక్కలు నాటడంతోపాటు, ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు గ్రామస్తులు కోరిన మేరకు 600 మొక్కలను పంపిణీ చేశారు. వచ్చే హరితహారానికి గాను 15 రకాలకు 1000 మొక్కలు పెంచుతున్నారు.
వైకుంఠధామం..
ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా గ్రామానికి చేరుకవలోని ప్రభుత్వ స్థలంలో వైకుంఠధామం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చిట్లపల్లి నుంచి అన్నారం గ్రామానికి పీఎంజీవై పథకం కింద రూ.6కోట్లతో బీటీ రోడ్డు పనులు చేపట్టారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
అన్నారం గ్రామ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహాయ సహకారాలతో గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి పరిచే విధంగా ఎమ్మెల్యే, ప్రజల సహకారాన్ని కోరుతున్నాను.
అన్నారానికి ఆహ్లాదం..
గతంలో గ్రామంలో కనీసం ఒక్క సీసీ రోడ్డు అందుబాటులో ఉండేది కాదు. రోడ్లు లేక ఇండ్ల ముందు మురుగునీటితో జీవనం గడిపేవాళ్లం. నేడు గ్రామానికి బీటీ రోడ్డు పూర్తి కావడంతో పాటు వీధుల్లో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్యార్డ్ వంటి అభివృద్ధి పనులు జరిగాయి.