వర్గల్, ఏప్రిల్ 9: సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి, స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి శుక్రవారం నాచగిరి క్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. తెలంగాణలోనే రెండో యాదాద్రిగా పిలువబడుతున్న నాచగిరి నృసింహస్వామి క్షేత్రం మహిమగల దేవాలయంగా పేరుగాంచిందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే హరిద్రానది ప్రక్షాళనకు రూ.7.48 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. హల్దీవాగు సుందరీకరణ తరువాత ఆలయ పునర్నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లతో పాటు ఇతర వసతులను స్తపతుల పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటాయని తెలిపారు.
భక్తుల కోసమే గోదావరి నీళ్లు..
నాచగిరి క్షేత్రాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. యాదాద్రి తరహాలో నాచారం గుట్టను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగానే హరిద్రా నదిని జీవనదిగా మార్చేందుకు గోదావరి జలాలను సీఎం తెచ్చినట్లు తెలిపారు. మంత్రి వెంట మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ హనుమంతరావు, పాలకమండలి సభ్యులు ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
రేపు నృసింహస్వామి రథోత్సవం
నాచగిరి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కార్యనిర్వాహకులు కట్ట సుధాకర్రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ శభ్నవీసు హనుమంతరావు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
ముస్లిం మహిళ మృతదేహానికి.. హిందూ ఆచారంతో అంత్యక్రియలు
అఖిల్ ప్రాణం పెట్టేస్తున్నాడు..!
కరోనా సెకండ్ వేవ్ తో యువతకే డేంజర్ : ఐఎంఏ ప్రెసిడెంట్ హెచ్చరిక