కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్తగా పట్టుకొచ్చిన పార్టీకి నిధులు సమకూరుస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీ వ్యవస్దాపకుడికి డబ్బులు ఇచ్చి సహకరిస్తోందని పార్టీ పేరు, నేత పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. మైనారిటీల ఓట్లను చీల్చి కాషాయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలో ఇటీవల ఓ కొత్త పార్టీని స్ధాపించారని ఆ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేయవద్దని దీదీ విజ్ఞప్తి చేశారు.
సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బీజేపీతో లాలూచీ పడ్డాయని ఆరోపించారు. బెంగాల్లో సీఏఏ, ఎన్పీఆర్ను కేవలం తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే అడ్డుకోగలుగుతుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక బంకురా జిల్లాలో ఇటీవల జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీని విషపూరిత కోబ్రాగా అభివర్ణిస్తూ ఆ పార్టీ ఎక్కడికి వెళ్లినా ప్రజలను కాటువేస్తుందని హెచ్చరించారు.