తెలంగాణ స్వరాష్ట్రంలో నేడు.. భూమి అంటే భరోసా.. గుంట పొలం ఉన్నా కొండంత బలం. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి అన్నదాతకు దన్నుగా నిలిచింది. భూ సమస్యలన్నింటికీ చెక్ పెట్టింది. రికార్డుల నిర్వహణను వ్యక్తుల నుంచి వ్యవస్థ చేతిలోకి మార్చింది. రైతు చేతుల్లోని పాస్బుక్కునే ప్రామాణికం చేసింది. అన్నదాతకు తెలియకుండా ఇంచుభూమి కూడా మార్చలేని విధానాన్ని తీసుకువచ్చింది.భూ లావాదేవీలన్నింటికీ రైతును కేంద్రంగా తీర్చిదిద్దింది. ఇప్పటిదాకా 1.7 లక్షల భూ సమస్యలకు పరిష్కారం చూపింది.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పహాణీ, పాస్బుక్ను భూమిహక్కు పత్రాలుగా పరిగణిస్తారు. తెలంగాణ వచ్చేనాటికి ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. పహాణీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లెక్కలనే ప్రామాణికంగా తీసుకొనేవారు. రైతువద్ద ఉండే పాస్బుక్ ఉట్టి కాగితంగానే మారేది. వ్యవస్థలో ఉన్న ఈ లోపాన్ని అడ్డుపెట్టుకొని అధికారులు పహాణీలో ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు చేశారు. రైతులకు తెలియకుండానే యజమానుల పేర్లు మార్చడం, విస్తీర్ణం తగ్గించడం, హద్దులు మార్చడం వంటివి చేసేవారు. రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మ్యుటేషన్ చేయించుకోకపోవడంతో పహాణిలో పాతపేర్లే కొనసాగేవి. దీంతో భూ సమస్యలు పెరిగిపోయాయి. వాటిని పరిష్కరించుకొనేందుకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగాల్సి వచ్చేది.
ధరణి పోర్టల్ వచ్చాక రికార్డుల నిర్వహణ వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థ చేతిలోకి మారింది. రైతు వద్ద ఉన్న పాస్బుక్కు.. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులకు మధ్య అనుసంధానం ఏర్పడింది. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా పాస్బుక్ తప్పనిసరి అయింది. రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్ జరుగుతుండటంతో వివరాలు ఒకేసారి ప్రభుత్వ రికార్డుల్లో, రైతు పాస్బుక్లో మారుతున్నాయి. అధికారులు రికార్డులను ఏకపక్షంగా మార్చేందుకు పోర్టల్ అనుమతించదు. రైతు కూడా తన పాస్బుక్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేరు. దీంతో గుంట భూమి ఉన్న రైతుకు కూడా తమ స్థలం ఎక్కడికీ పోదనే భరోసా దక్కింది. విచక్షణాధికారుల మాటున జరిగే దందాలకు చెక్పడింది. ధరణి పోర్టల్ సాధించిన మొదటి విజయమిది.
ఒక్కోరకమైన భూ సమస్య పరిష్కారానికి ధరణి పోర్టల్లో ఒక్కో మాడ్యూల్స్ను ప్రవేశపెట్టారు. దీంతో ఇప్పటిదాకా ఉన్న సమస్యలు క్రమంగా పరిష్కారమవుతూ వస్తున్నాయి. ఏండ్లుగా పెడింగ్లోఉన్న సుమారు 1.38 లక్షల మ్యుటేషన్లకు మోక్షం కలిగింది. భూ సంబంధ సమస్యలపై అభ్యర్థనలకు తెచ్చిన ‘గ్రీవెన్స్ మాడ్యూల్’ ద్వారా 35 వేలకుపైగా చిక్కులను పరిష్కరించారు. ఈ క్రమంలో ఎక్కడా ఒక్క రూపాయి అదనంగా చెల్లించాల్సిన అవసరం రాలేదు. బాధితులు నేరుగా లేదా మీసేవ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి.. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. తమ లాగిన్కు వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి.. సక్రమంగా ఉన్నవాటిని పరిష్కరించారు. ఇది ధరణి పోర్టల్ సాధించిన ఘన విజయం.
రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది రైతులకు చెందిన భూముల రికార్డులు క్లియర్గా ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఇతర సబ్సిడీలు నేరుగా రైతులకు చేరుతున్నాయి. ధాన్యం కొనుగోలుచేసిన సొమ్మూ ఆయా రైతుల ఖాతాల్లోనే జమ అవుతున్నది. ఏదేని సమస్య కారణంగా భూములు పార్ట్-బీలో ఉన్న భూములు ధరణి పోర్టల్లో వేగంగా పార్ట్-ఏలోకి మారిపోతున్నాయి. పార్ట్-బీ నుంచి పార్ట్-ఏ లోకి వచ్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు అందనున్నది.