మేడ్చల్ మల్కాజిగిరి : అక్రమంగా గుజరాత్కు తరలిస్తున్న 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ పోలీసుల సమాచారంతో కీసర పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం.. కీసర మండలంలోని తిమ్మాయిపల్లిలో అడ్డాను ఏర్పాటు చేసుకొన్న కొంతమంది అక్రమార్కులు ఏకంగా రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తిమ్మాయిపల్లి నుంచి కీసర ఔటర్రింగ్ రోడ్డు మీదుగా గుజరాత్ రాష్ర్టానికి తరలిస్తున్నారు.
కీసర పోలీసులు ఆ ముఠాను బుధవారం తెల్లవారుజామున రెడ్హ్యండెడ్గా ఔటర్రింగ్ రోడ్డు వద్ద పట్టుకున్నారు.
ఒకే రోజు రెండు గ్యాంగ్ల వారు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా రెండు గ్యాంగ్లకు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యానికి సంబంధించి రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆటో, వ్యాన్లో 40 టన్నులు, లారీలో 250 టన్నుల బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా బహుదూర్పూర్కు చెందిన ఇద్దరు డ్రైవర్లు, బాలక్పూర్కు చెందిన 4డ్రైవర్లు, గుజరాత్కు చెందిన ఇద్దరు డ్రైవర్లు కలిసి గుజరాత్కు తరలిస్తున్నారు. ఔటర్రింగ్రోడ్డు వద్ద బియ్యంతో పాటు 8మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.