హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును ప్రతి ఊరిలో, ప్రతిగుడిలో పెంచాలనే సంక్పలం తో గ్రీన్ఇండియా చాలెంజి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. దసరా పండు గ సందర్భంగా ఊరుఊరికో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు గ్రీన్ఇండియా చాలెంజి వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించా రు. ఇందుకోసం ఇప్పటికే 20 వేలకు పైగా మొక్కలను సిద్ధం చేసినట్టు చెప్పారు. వీటిని అన్ని గ్రామాలు, దేవాలయాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను అటవీ, దేవాదాయశాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. పురాణకాలం నుంచి జమ్మి చెట్టుకు ప్రాధాన్యమున్నదని వివరించారు. ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో జమ్మి వృక్షం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ వేదకాలం నుంచి నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ప్రతి ఊరిలో, గుడిలో పెంచాలన్న గ్రీన్ ఇండియా చాలెంజి సంకల్పం గొప్పదని అభినందించారు. జమ్మి మొక్కలను నాటి, వాటిని సంరక్షించడంలో తమ వంతు సహకారం అందస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజి ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో దసరా పండుగనాడు జమ్మి చెట్టును పూజించడం, బంధుమిత్రులకు ఆకులను పంచిపెట్టి, నమస్కరించడం ఆనవాయితీ. మైసూరులోనూ జమ్మిని పూజిస్తారు. తెలంగాణతోపాటు రాజస్థాన్ కూడా జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా గౌరవించుకుంటున్నది. వినాయక చవితి పూజలోనూ వాడతారు. దుర్గమాత స్వరూపమైన జమ్మిని పూజిస్తే శని తొలగిపోతుందనేది భక్తుల విశ్వాసం. శ్రీరామచంద్రుడు, పాండవులు జమ్మిని పూజించినట్టు పురాణాలు చెప్తున్నాయి. జమ్మిచెట్టు కరువులోనైనా బతుకుతుంది. ఔషధ గుణాలున్న దీని సగటు జీవిత కాలం 120 ఏండ్లు. భూసారాన్ని పరిరక్షించడంతో, ఎడారుల్లో పెనుగాలులను నివారించే శక్తి ఉన్న వృక్షమిది. యునైటెడ్ ఎమిరేట్స్ దీనిని జాతీయ వృక్షంగా ప్రకటించింది. బెహ్రెయిన్లో ఏమాత్రం తేమలేని ప్రాంతంలో పెరుగుతున్న 500 ఏండ్ల వయస్సున్న జమ్మి వృక్షాన్ని (షరాజత్ అల్ హయత్) ప్రపంచంలోని ఏడు కొత్త ప్రకృతి వింతల జాబితాలో చేర్చారు.
దసరా సందర్భంగా ప్రతి ఊరిలో జమ్మి చెట్టు నాటనున్నట్టు గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి జమ్మి మొక్కలు నాటారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జమ్మి మొక్కలు నాటుతామని తెలిపారు.