మెదక్ : వానాకాలం ధాన్యాన్ని కొంటామని రైతులకు అభయం కల్పించిన సీఎం కేసీఆర్కు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఈ వానాకాలానికి సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
తక్షణమే కొనుగోళ్లకు ఉత్తర్వులు జారీ చేసి గతంలో మాదిరిగానే గ్రామాల్లో సేకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. దొడ్డు ధాన్యం కొనుగోళ్లు చేయరంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళనను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నేనున్నానంటూ అభయమిచ్చారని పేర్కొన్నారు.
గత వానాకాలం, యాసంగిలో సేకరించినట్టుగానే ఈ వానకాలంలోనూ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
మెదక్ జిల్లాలో యాసంగిలో 4 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, ఈ సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, రైతుల నుంచి ప్రతి గింజను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పంట చేతికొచ్చిన ప్రాంతాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించిందని ఆమె తెలిపారు.