హైదరాబాద్: ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులను కలిశారని చెప్పారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీని కలిశారని, చైనా రాయబారిని కూడా కలిశారని చెప్పారు. మరి అది దేశద్రోహమా అని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం టికెట్లను సీఎం కేసీఆరే డిసైడ్ చేస్తారనడం హాస్యాస్పదమన్నారు. మతత్వ పార్టీలతో పొత్తులు పెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చెప్పారు. రేవంత్ రెడ్డి.. గోబెల్స్ రేవంత్రెడ్డిగా మారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులను గౌరవించడం టీఆర్ఎస్ సాంప్రదాయమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఏమిటో నేర్చుకోవాలన్నారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవా చేశారు.