ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్తదనాన్ని, వైవిధ్యతను నమ్ముకుంటేనే రాణించగలమని విశ్వసిస్తున్నారు అందాల కథానాయికలు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అవకాశం దొరికితే ప్రయోగాలతో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. చాలెంజింగ్ పాత్రలతో తమలోని కొత్త కోణాల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లతో పాటు నవతరం నాయికలు సైతం ప్రయోగాలకు సై అంటున్నారు.
గతంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన ముంబయి ముద్దుగుమ్మ హన్సిక ప్రస్తుతం తన జోరును తగ్గించింది. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తోంది. తాజాగా హన్సిక సింగిల్ క్యారెక్టర్తో ‘105 మినిట్స్’ పేరుతో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నది. సింగిల్ షాట్లో ఎడిటింగ్ లేకుండా రీల్ టైమ్ రియల్టైమ్ అంశాలతో చాలెంజింగ్గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది. హన్సిక మినహా ఈ సినిమాలో నటీనటులెవరూ కనిపించరని, ఒకే ఒక్క పాత్రతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. రాజు దుస్సా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘మహా’లో హన్సిక నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో కనిపించబోతున్నది.
కథానాయిక పాత్రలకు పరిమితం కాకుండా ‘ఎవరు’, ‘చక్ర’ సినిమాల్లో నెగెటివ్ రోల్స్తో కనిపించి ప్రతిభను చాటుకొంది రెజీనా. రొటీన్ పాత్రలు ససేమిరా చేయనని అంటోన్న ఆమె సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ట్రైనీ పోలీస్ పాత్రలో నటిస్తోంది. కొరియన్ చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనాతో పాటు నివేదా థామస్ మరో హీరోయిన్గా కనిపిస్తోంది. కిడ్నాప్ కేసును అన్వేషించే క్రమంలో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీస్ ఆఫీసర్స్కు ఎదురయ్యే పరిణామాలతో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నది. ఇందులో రెజీనా, నివేధా థామస్ పాత్రలు భిన్న షేడ్స్తో పవర్ఫుల్గా సాగుతాయని చిత్రబృందం చెబుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తమిళ చిత్రసీమలో మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది ఐశ్వర్యరాజేష్. కమర్షియల్ పంథాకు భిన్నంగా సహజత్వంతో కూడిన కథలు, పాత్రలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్న ఆమె త్వరలో టాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తబోతున్నది. ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రలో ‘డ్రైవర్ జమున’ పేరుతో తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో జీవనోపాధి కోసం టాక్సీ డ్రైవర్గా మారిన యువతిగా ఐశ్వర్యరాజేష్ నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె డ్రైవింగ్లో శిక్షణ తీసుకుందని చిత్రబృందం చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కిన్స్లిప్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
కాజల్ అగర్వాల్ గూఢచారిగా మారిపోనుంది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ‘రా’ ఏజెంట్గా నటిస్తోంది. గ్లామర్ తళుకులకు దూరంగా పూర్తి యాక్షన్ ప్రధానంగా ఆమె క్యారెక్టర్ సాగుతుందని చెబుతున్నారు. తన పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్లో కాజల్ శిక్షణ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ ప్రధాన పాత్రల్లో అడవి నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో రకుల్ప్రీత్సింగ్ గొర్రెల కాపరిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నది. తమిళ చిత్రం ‘నెట్రికన్’లో నయనతార అంధురాలిగా నటించబోతున్నది. ‘గమనం’ చిత్రంలో ‘శ్రియ’ మూగ, చెవిటి మహిళగా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.