హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రూ.కోటి చొప్పున వెచ్చించి హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వీటిని నిర్మిస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే రూ.119 కోట్లు విడుదలచేసింది. ఈ నిధులతో ఆర్అండ్బీశాఖ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 104 నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించగా.. భూమి అందుబాటులో ఉన్న 97 కేంద్రాల్లో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటివరకు 89 నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. వీటిలో పలు కార్యాలయాలను ఇప్పటికే ప్రారంభించడంతో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేలకు విన్నవించుకునే అవకాశం లభించింది. ఎమ్మెల్యేలు కూడా తమ కార్యాలయానికి అధికారులను పిలిపించుకొని సమీక్షించే వెసులుబాటు కలిగిం ది. మిగిలిన 15 నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు ఒకట్రెండు నెలల్లో అం దుబాటులోకి రానున్నాయి.