హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన కొద్దికాలంలోనే అబ్బురపరిచే ప్రగతిని సాధిస్తూ అన్ని రంగాల్లోనూ అసాధారణ పురోగతి సాధిస్తున్నదని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను ప్రశంసలతో ముంచెత్తారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుతో భారీ నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠంచేస్తే.. మిషన్ కాకతీయతో చిన్ననీటిపారుదల వ్యవస్థ బలోపేతమైందని అన్నారు. దేశమంతా ముక్కున వేలేసుకొనేలా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వును వికసింపజేశారంటూ కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమలరంగంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఐటీలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని.. ఇందుకు ఓ హైదరాబాదీగా గర్వపడుతున్నానని చెప్పారు. నిజాంకాలంలో వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ, వరంగల్ ఆజంజాహీమిల్లు, కాగజ్నగర్లో సర్సిల్క్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో డీబీఆర్ మిల్స్ ఇలా పలు పరిశ్రమలను ఏర్పాటుచేస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ముందుచూపులేక మూతపడేలా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ దూరదృష్టితో అభివృద్ధిని రాష్ట్రమంతా విస్తరిస్తున్నారని అన్నారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామికాభివృద్ధికీ సమప్రాధాన్యమిస్తున్నారని ప్రశంసించారు. పవర్ హాలిడేలతో పరిశ్రమలు నడుపుకోలేని దుస్థితి నుంచి ఇవ్వాళ మిగులు విద్యుత్ రాష్ట్రంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని కొనియాడారు.
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ద్వితీయ క్షేత్రంగా హైదరాబాద్ను ఎంచుకోవటం వెనుక మంత్రి కేటీఆర్ కృషి అసామాన్యమైందని అక్బరుద్దీన్ ప్రశంసించారు. ఐటీ అంటే బెంగళూరు అన్న స్థితిని హైదరాబాద్ తిరగరాసిందన్నారు. తానొక హైదరాబాదీ అని ఎక్కడికి పోయినా గర్వంగా చెప్పుకొంటానని తెలిపారు. ఐటీని రెండోశ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ వంటి జిల్లాలకు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఆర్బీఐ సహా పలు జాతీయసంస్థలు ఇచ్చిన నివేదికల్లో హైదరాబాద్ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉండటం గొప్ప విషయమన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి గొప్ప కంపెనీలను హైదరాబాద్కు తేవడంలో కేటీఆర్ డైనమిక్గా వ్యవహరిస్తున్నారని అభినందించారు.
ప్రపంచం అంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్రం మాత్రం అన్ని రంగాల్లో అద్వితీయ ప్రగతి సాధించిందని అక్బరుద్దీన్ అన్నారు. జాతీయ నిర్మాణ సంస్థ (నాక్) ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త జోనల్ విధానం ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందించారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యంకాదని, అందుకే ప్రైవేట్రంగంలో రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పాతబస్తీని భాగస్వామ్యం చేయాలని కోరారు. పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని, ఐటీ రంగాన్ని పాతబస్తీకి విస్తరించేలా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఐటీ, పరిశ్రమలు అద్భుతంగా పురోగమిస్తున్నాయని ఆర్బీఐ సహా అనేక జాతీయ సంస్థ లు రాష్ర్టాన్ని కీర్తిస్తుంటే ఇక్కడున్న విపక్షాలు మాత్రం అడ్డగోలు ముచ్చట్లు చెప్తున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. సోమవారం శాసనసభలో ఐటీ, పరిశ్రమలపై చర్చలో మాట్లాడుతూ ఐటీ విధానంలో తెలంగాణ ప్రపంచానికే మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందని శశిథరూర్ వంటి మేధావులు కీర్తిస్తే స్థానికంగా ఉన్న వాళ్ల పార్టీ నేతలు ఏ స్థాయిలో దిగజారి మాట్లాడారో దేశమంతా చూసిందని ఆయన గుర్తుచేశారు.