హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్ధులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
కొవిడ్ నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలని మల్లయ్య భట్టు సూచించారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా రాష్ట్రంలోని జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలల్లో, మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. హాల్టికెట్ డౌన్లోడ్లో ఏమైనా ఇబ్బందులు వస్తే 040-23326266 నెంబర్ను సంప్రదించాలని చెప్పారు.